గురుర్దేవో మహేశ్వరః
దీపపు కాంతిలో పటంలో ఉన్న దుర్గా మాత చూపు సజీవంగా కనిపిస్తోంది. ఆ నవ్వు జన్మ జన్మల దుఃఖాన్ని బాపేంత దివ్యంగా ఉంది. నా ఇల్లు, నా కుటుంబం, నా పూజ గది - ఇవేవీ నాకు కనిపించడం లేదు. మొగలి పరిమళపు అగరొత్తులు, దీపారాధన వెలుగులో బెజవాడ దుర్గమ్మ చిరునవ్వు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ చూపు నుంచి ఒక వెలుతురు తదేకంగా ప్రసరించి నా వైపు నెమ్మదిగా కదులుతూ వచ్చి నన్ను తాకింది, నా ఒళ్ళు జలదరించింది. "ఏవండీ, మధ్యాహ్నానికి కూరగాయలు తేవాలి" అని నా భార్య పిలుపు. ఈ లోకంలోకి వచ్చాను. "నేనెంత అదృష్ట వంతుడిని. అతి సామాన్య గృహస్థుని. ఒకానొక సమయంలో నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నీ భయంకరంగా ఉన్న సమయంలో - దేవుడిని ప్రార్థించడం, పూజలు చెయ్యడం అప్రయత్నంగా మొదలు పెట్టాను. చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహానుభావుల ప్రవచనాలు వింటూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను అదే పనిగా అమ్మవారిని, పరమ శివుడిని ఆరాధిస్తున్నాను. నాకిప్పుడు ముప్ఫయ్ ఎనిమిదేళ్లు. నా 28 వ ఏట నుంచి ఈ ఆరాధన కొనసాగుతూ ఉంది. ఎన్నో భగవంతుడి మహిమలను చవిచూశాను నేను...